హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎంతో మంది నిరుపేద రోగుల ప్రాణాలను కాపాడుతున్న నిమ్స్ వైద్యులు.. తాజాగా అత్యంత అరుదై న, ప్రమాదకరమైన అయోర్టా (కడుపులో పె ద్ద రక్తనాళం ఉబ్బటం) వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి జయప్రదంగా వాస్యులర్ శస్త్రచికిత్స చేసి, కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వివరాల్లోకెళ్తే.. ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చింతగుంట్ల గమానియేలు ఉపాధి కోసం 20 ఏండ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి, చెప్పుల షాపు నడుపుతున్నాడు. డిసెంబర్లో గమానియేలుకు జ్వరం రావడంతో స్వగ్రామం రేపల్లెలో చికిత్స తీసుకున్నాడు. ఫలితం లేక మంగళగిరిలోని ఎన్ఆర్ఐ దవాఖానకు వెళ్లాడు.దీంతో కడుపులో రక్తనాళం ఇన్ఫెక్షన్కు గురైనట్టు నిర్ధారించిన వైద్యులు.. హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు.
గమానియేలు హైదరాబాద్లో పలు దవాఖానలను ఆశ్రయించగా.. శస్త్రచికిత్సకు 12 లక్షలు అవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని ఆయన.. తన సన్నిహితుల సూచన మేరకు నిమ్స్ను ఆశ్రయించాడు. దీంతో గమానియేలుకు అన్ని రకాల పరీక్షలు జరిపించిన నిమ్స్ డాక్టర్లు రమేశ్, సంకీర్తన.. వ్యాస్క్యులర్ సర్జరీ కోసం ఆయనను ఆ విభాగానికి రెఫర్ చేశారు. అనంతరం నిమ్స్ వాస్యులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సందీప్ మహాపాత్ర తన సహచరులు డాక్టర్ అనూష, డాక్టర్ ప్రజ్ఞ, డాక్టర్ పవన్, డాక్టర్ వెంకట్తో కలసి దాదాపు 13 గంటలపాటు శస్త్రచికిత్స జరిపారు. కడుపులో ఇన్ఫెక్షన్కు గురై ఉబ్బిపోయిన పెద్ద రక్తనాళాన్ని శుభ్రం చేసి, బైపాస్ చేశారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద కేవలం రూ.2 లక్షలకే అందించామని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ సందీప్ మహాపాత్ర తెలిపారు.