హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పును వివరిస్తూ నమస్తే తెలంగాణ దినపత్రిక నెట్వర్క్ ఇంచార్జి ఎస్జీవీ శ్రీనివాస్రావు రూపొందించిన వీడియోపై ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన కేటీఆర్.. ఒక దార్శనికుడి ఆనాటి సంకల్పం.. ఈనాటి పల్లెల పచ్చని మందహాసం.. అని ట్వీట్ చేశారు. ‘తెలంగాణను కొత్తగా కనిపెట్టాలి. కొత్త ఆలోచనలతో.. కొత్త ఒరవడితో.. తెలంగాణ కాంటెక్స్తో.. తెలంగాణ కండ్లతో.. తెలంగాణ ఆవిష్కారం కావాలి..’ అన్న సీఎం కేసీఆర్ మాటలతో వీడియో మొదలవుతుంది. పల్లెల్లో పచ్చటి పొలాలు, మిషన్ కాకతీయతో నిండిన చెరువులు, పల్లెప్రకృతి వనాలు, హరితహారంలో నాటిన మొక్కలు, మిషన్ భగీరథతో ఇంటింటికీ అందుతున్న నీరు, వైకుంఠధామాలు, సెగ్రిగేట్ షెడ్లు, ట్రాక్టర్లతో చెత్త సేకరణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, చేపపిల్లల పంపిణీ, గొర్రెపిల్లల పంపిణీ, కంటివెలుగు, పంట ఆరబెట్టే కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, వాటి ఫలితాలను ఈ వీడియోలో చూపించారు.