హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): గూఢచర్యానికి సంబంధించిన కేసును ఏపీ పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న 20 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2014-20 మధ్యకాలంలో పాకిస్తాన్కు చెందిన టెలిఫోన్ నంబర్ 923243428487 నుంచి కొందరు గుర్తుతెలియని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఏజెంట్లు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్లో పనిచేస్తున్న కొంతమంది అనుమానిత వ్యక్తులతో మాట్లాడారని ఎన్ఐఏ పేర్కొన్నది. కొందరు గుర్తుతెలియని ఇంటెలిజెన్స్ అధికారులు, ఏజెంట్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి నేరపూరిత కుట్ర పన్నినట్టు తెలిపింది. వీరంతా దేశంలోని తూర్పు, పశ్చిమ సముద్ర తీరాలకు చెందిన కీలకమైన, రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నది. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.