రాంనగర్, ఆగస్టు 10: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హుస్సేనిపుర ప్రాంతంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) గురువారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఖదీర్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఖదీర్తోపాటు అతని కుటుంబ సభ్యులను, బంధువులను పిలిపించి విచారణ జరిపినట్టు తెలిసింది. ఖదీర్ రెండో కుమారుడు తబ్రీజ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కరీంనగర్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం సివి ల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉపాధి నిమిత్తం గల్ఫ్లో వెళ్లినట్టు తెలిసింది. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఏడాదిన్నర కాలంగా ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు జరుపుతున్నది. అప్పట్లోనే కరీంనగర్లో సోదాలు జరిపి పలువురిని అదుపులోకి తీసుకోగా అప్పటి నుంచి పీఎఫ్ఐ కార్యకలాపాలపై స్థానిక పోలీసులు కూడా దృష్టిపెట్టారు. తాజాగా ఎన్ఐఏ అధికారులకు అందిన కీలక సమాచా రం మేరకు కరీంనగర్, కర్నూలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.