హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ‘మీరు ఇస్తున్న హామీలు, చెప్తున్న అంశాలపై స్పష్టత ఇస్తేనే మీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాదిరిగానే మీతో కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని మానవ హక్కుల వేదిక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. విభజన రాజకీయాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, సంపద కేంద్రీకరణ, ప్రజాస్వామ్యం-హక్కులు వంటి అంశాల్లో బీజేపీ తరహాలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా భిన్నంగా పాలిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరింది. దేశ ప్రజల మధ్య బీజేపీ విద్వేష బీజాలు నాటిందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్వేష రాజకీయాలను ఎండగట్టేందుకు రాహుల్ జోడో యాత్ర చేపట్టడాన్ని అభినందిస్తున్నామని తెలిపింది.
నిరుద్యోగ సమ స్యపై రాహుల్ ఇస్తున్న హామీలు బాగానే ఉన్నాయని, అయితే గత కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు బీజం పడిందనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేసింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉంటే గత విధానాలను సమీక్షించి ఉద్యోగ కల్పనపై స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని సూచించింది. ఓ విధానమంటూ లేని బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగడంతో పేదల బతుకులు ఆగమైతున్నాయని పేర్కొన్నది. ఈ ధరల పెరుగుదలకు ఇప్పటి బీజేపీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కారణమేనని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే చర్యలేమిటో వివరించాలని డిమాండ్ చేసిం ది.
జోడో యాత్రలో రాహుల్ ఎక్కడా ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడకపోవడాన్ని మానవ హక్కుల సంఘం ఆక్షేపించింది. కాంగ్రెస్ పాలనలోనే ఎన్నో అణిచివేత చట్టాలు రూపుదిద్దుకున్నాయనే విషయాన్ని తామెవరమూ మర్చిపోలేదని తెలిపింది. దేశం లో ఎక్కడికక్కడ ప్రజల హక్కులను బీజేపీ కాలరాస్తున్నదని మండిపడింది. కాంగ్రెస్ తెచ్చిన ఉపా చట్టాన్నే బీజేపీ ఇంకా బలోపేతం చేస్తున్నదనే విషయం తెలియదా? అని రాహుల్ను ప్రశ్నించింది. ఈ చట్టం రద్దుకు కృషి చేస్తానని ప్రకటన చేయాలని కోరింది.