Telangana Sahitya Academy | బహుజనులకు అండగా నిలిచి సామాజిక ఉద్యమాలు నిర్మిస్తూ సాహిత్య సాంస్కృతిక చరిత్రలను సృష్టించిన సాహిత్య సాంస్కృతిక సామాజిక యోధుల చరిత్రలను నమోదు చేసుకోవడం శుభ పరిణామం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భావి తరాలకు మన సాహిత్య సాంస్కృతిక చర్యలను అందించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నదన్నారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 17, 18 తేదీల్లో ‘బహుజన స్ఫూర్తి ప్రదాతలు’ అనే అంశంపై జరుగనున్న రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్ను మంగళవారం అకాడమీలో జూలురు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూలూరి గౌరి శంకర్ మ్లాడుతూ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు సామాజిక ఉద్యమకారులు కలం యోధులుగా మారి అద్భుతమైన సాహిత్య సృష్టి చేశారన్నారు. భాగ్యరెడ్డి వర్మ, ముగ్ధూం మొహినుద్దీన్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సామల సదాశివ, కొత్తపల్లి జయశంకర్, బిరుదరాజు రామరాజు, కాపు రాజయ్య, కపిలవాయి లింగమూర్తి, చందాల కేశవదాస్, చిందు ఎల్లమ్మ వంటి అనే మంది తమ కలాలు, గళాల ద్వారా బహుజన స్ఫూర్తి రగిలించిన యోధులని అభివర్ణించారు.
బహుజన గళాలు, కలాలు లేకుండా తెలుగు సాహిత్యమే లేదని జూలూరి గౌరి శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రమేశ్ బాబు, తెలుగు శాఖ అధ్యక్షులు వెల్దండి శ్రీధర్, ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.