ఎల్బీనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): న్యూస్లైన్ జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. రక్తంతో తడిసిన చొక్కాతో ఆయన ఉన్న సంక్షిప్త వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
యూట్యూబ్లోనూ, తనకు చెందిన ‘తెలంగాణం’ డిజిటల్ పత్రికలోనూ ప్రభుత్వ వ్యవహారశైలిని జర్నలిస్ట్ శంకర్ ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. పలుమార్లు తీవ్ర బెదిరింపులను ఎదుర్కొని మరీ ఆయన తన పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఆయనపై దాడి జరిగింది. శంకర్పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని, తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా దాడులు మొదలయ్యాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు శంకర్పై దాడికి వ్యక్తిగత గొడవలే కారణమని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.