ఆంగ్ల, ఉర్దూ భాషల పత్రికలు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పరిచయమయ్యాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన వార్తలు హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్ల రూపంలో దర్శనమిచ్చేవి. తెలుగు పత్రికల కంటే ముందే హైదరాబాద్లో ఆంగ్ల భాషలో కొన్ని పత్రికలు వెలువడ్డాయి.
ఆంగ్లంలో మొదటి పత్రిక దక్కన్ టైమ్స్ 1864లో సికింద్రాబాద్ నుంచి ప్రచురితమయ్యింది. 1884లో హైదరాబాద్ టెలిగ్రాఫ్, 1885లో హైదరాబాద్ రికార్డర్ ప్రారంభమయ్యాయి. ఈ ఆంగ్ల పత్రికల ద్వారా హైదరాబాద్ సంస్థానంలోని విద్యావంతుల్లో సాంస్కృతిక, జాతీయ భావాలు వ్యాపించాయి. ‘హైదరాబాద్’ రికార్డర్ బ్రిటిష్ రెసిడెంటును స్థానిక సీజర్గా అభివర్ణించింది.