హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీస్కు అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ భవన నిర్మాణం వేగంగా సాగుతున్నది. ప్రతీ కార్యాలయాన్ని ప్రత్యేక డిజైన్తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. రూ.654.50 కోట్లతో 15 జిల్లా పోలీస్ కార్యాలయాలు (డీపీవో), సిద్దిపేట, రామగుండం పోలీస్ కమిషనరేట్ల భవనాల నిర్మాణం చేపట్టారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలు జూన్ 20న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రామగుండం, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, నాగర్కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జగిత్యాల, నిర్మల్, మెదక్లో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నారాయణపేటలో ఇటీవలే స్థలాలు గుర్తించారు.
ఒక్కో భవన సముదాయాన్ని రూ.38.50 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రతి కార్యాలయంలో కమిషనర్, ఎస్పీల ఆఫీస్లతోపాటు డీఎస్పీ చాంబర్లు, కాన్ఫరెన్స్ హాల్, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్టు వెరిఫికేషన్ సెల్ నిర్మిస్తున్నారు. మొదటి అంతస్థులో అడ్మినిస్ట్రేషన్, రెండో అంతస్థులో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ కోర్ టీం, సైబర్ ల్యాబ్, సిబ్బంది శిక్షణ కోసం పెద్ద డిజిటల్ ట్రైనింగ్ హాల్స్, ఎలక్ట్రికల్ ప్యానల్రూం, ఐటీ కోర్టీం, క్లూస్ టీం విభాగాలు ఉంటాయి. ప్రతి భవనానికి విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫిర్యాదులు, ఇతర పనులపై వచ్చే సామాన్య ప్రజల వద్దకే నేరుగా ఎస్పీ, కమిషనర్లు వచ్చి మాట్లాడేలా నిర్మిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్హాల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.