వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 4: అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో విసిరేసి పేగుబంధాన్ని వదులుకున్నది ఓ మూర్ఖురాలు. ఈ అమానవీయ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం పాత్రపురంలో బుధవారం వెలుగుచూసింది. కనురెప్పలు తెరువకముందే పసికందును కడతేర్చాలని చెట్లపొదల్లో విసిరేసిన దారుణం స్థానికులను కలచివేసింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యం చేయించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం దవాఖానకు తరలించగా శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాత్రపురం శివారులోని చెట్ల్లపొదల్లో పసికందు ఏడుపును గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వెంటనే స్పందించి శిశువు ప్రాణాలు కాపాడారు. పుట్టిన బిడ్డ ఆడపిల్ల అనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. కాగా శిశువును పొదల్లో పారేసిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.