హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘా బృందాలను మోహరించింది. మొత్తం 50కిపైగా బృందాలను మఫ్టీల్లో విధుల్లోకి దింపామని, వీరంతా జిల్లా కేంద్రాల్లోని బార్లు, రెస్టారెంట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పబ్బుల్లో విధులు నిర్వర్తిస్తారని ఎక్సైజ్ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ వాడినా, అశ్లీల నృత్యాలు చేసినా, బార్లు, పబ్బుల్లోకి మైనర్లను అనుమతించినా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 20 బృందాలను రంగంలోకి దింపడంతోపాటు అక్రమ మద్యం నియంత్రణ కోసం రైళ్లలో తనిఖీలు చేపట్టేందుకు 13 బృందాలను మోహరించామని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు విమానాశ్రయంలోనూ పటిష్ఠ నిఘా పెట్టామని వివరించారు. కేవలం తనిఖీలకు కేటాయించిన బృందాలే కాకుండా రెగ్యులర్గా విధులు నిర్వర్తించే ఎక్సైజ్ అధికారులు 3 షిఫ్టుల్లో 24 గంటలూ విధుల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.