హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పార్శిళ్ల బుకింగ్లో చిల్లర సమస్యతోపాటు కమీషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నెల 1 నుంచి బార్కోడ్, క్యూఆర్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా బుకింగ్ కేంద్రాల్లో బార్కోడ్, క్యూఆర్ కోడ్ యంత్రాలను ఏర్పాటు చేసినట్టు కార్గో అధికారులు వెల్లడించారు. పార్శిళ్ల బుకింగ్తో ప్రతి నెలా కనీసం రూ.1.50 కోట్ల చొప్పున ఆదాయం లభిస్తున్నదని, ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.18.34 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోగామని తెలిపారు. ఈ నెలలో మరో రూ.1.70 కోట్ల వరకు ఆదాయం రావచ్చని చెప్పారు.
హైదరాబాద్లో మరిన్ని బుకింగ్ కేంద్రాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి దాదాపు 80 పార్శిల్ బుకింగ్ కేంద్రాలు ఉన్నాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో మరిన్ని బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. దీనిలో భాగంగా రానున్న రెండు నెలల్లో మరో 15 బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గత 11 నెలల్లో ఆర్టీసీ కార్గో ద్వారా 7,33,714 పార్శిళ్లను చేరవేసినట్టు తెలిపారు.