పనులు వేగంగా, సమాంతరంగా జరగాలి
డిజైన్లు అందంగా ఉండేలా చూసుకోండి
ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
నిర్మాణాలపై సూచనలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కొత్త సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను సునిశితంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. పలు అంశాలపై పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పిల్లర్లు, గోడలు, మెట్లు, తలుపులు, కిటికీల డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల చాంబర్లు, సమావేశ మందిరాలు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వీటిలోకి గాలి, వెలుతురు బాగానే వస్తున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, సామర్థ్యం గురించి ఆరా తీశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.
పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచించారు. సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటెయిన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బిల్డింగ్ డిజైన్లు, కలర్లు, ఇంటీరియర్ సహా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు.
ముఖ్యమంత్రి వెంట, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, ప్రియాంక వర్గీస్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు పాల్గొన్నారు.