హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లోని ఉద్యోగులంతా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నెలవారీ హాజరు లెక్కింపు విషయంలోఎఫ్ఆర్ఎస్ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది.
ఉద్యోగులకు ఏడాదిలో 15 సాధారణ సెలవులు (సీఎల్స్), 30 ఆర్జిత సెలవులు (ఈఎల్స్) ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యాజువల్ లీవులకు కోత పెట్టనున్నారు. అయిపోయాక ఈఎల్స్లో కోత పెడుతారు. కార్యాలయ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు కార్యాలయ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం అధికారులు ఉద్యోగుల ఎఫ్ఆర్ఎస్ హాజరు, సెలవుల ఖాతాలను నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాజరు వివరాలను ప్రతి నెల 20వ తేదీలోపు అకౌంట్స్ ఆఫీసర్కు నివేదిక సమర్పించాలని సూచించారు.
విద్యాశాఖ డైరెక్టరేట్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు విషయంలో విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. అయితే ఇవే నిబంధనలను టీచర్లకు సైతం వర్తింపజేస్తారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లు ఉన్నారు. వీరికి సైతం ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలు చేస్తున్నారు. అయితే సెలవులు, జీతానికి కోత పెట్టడం లేదు. కొందరు టీచర్లు అదే పనిగా విధులకు గైర్హాజరవుతున్నారు.
ఇటీవలే జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. మిగతా జిల్లాల్లోనూ కొందరికి నోటీసులిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇంత వరకు ఆన్డ్యూటీ ఇవ్వలేదు. కానీ సంఘాల నాయకుల్లో అత్యధికంగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీనిని సీరియస్గా పరిగణిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంకాగానే ఆలస్యంగా వెళ్లిన టీచర్ల సీఎల్స్, ఈఎల్స్కు కోత పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.