నిజామాబాద్ : కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని రుద్రూరు మండలం సిద్దాపూర్, రాయకూర్ క్యాంపు, రాయకూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటికే పది లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల సాయం అందిందన్నారు.రైతు బీమా సహాయాన్ని వృథాగా ఖర్చు చేయవద్దు. ఆ నగదును కుటుంబ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పేదల ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్ బెడ్ రూం పథకాన్నిసీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆయన తెలిపారు. కాగా,
రాయకూర్ క్యాంప్ గ్రామ ముఖద్వారాన్ని సొంత ఖర్చుతో నిర్మించిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కొప్పుల మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఒక ఎత్తు అయితే ప్రజా సమస్యలను తీర్చడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక ఎత్తు అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంత పెద్ద ఎత్తున నిర్మించడం రికార్డు. పదివేల ఇండ్లు నిర్మించడం అందరికీ సాధ్యం కాదన్నారు. ఇది స్పీకర్ పోచారంకే సాధ్యమైందన్నారు.