నారాయణఖేడ్, జూలై 22: డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎసరు పెట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే ఎం భూపాల్రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు పొరుగున ఉన్న బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో లేవన్నారు. బీజేపోళ్లు చెప్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇక్కడ పేదలు, రైతులను ఆదుకొంటున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను రద్దు చేసి కర్ణాటకలో అమలవుతున్న ఎందు కూ పనికిరాని పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతులు మొదలుకొని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుండగా, ఇంకా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని చేశారా? అని అడిగారు. అసత్యాలు చెప్పే బీజేపీని నమ్మకుండా ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టకుంటే రూ.6,500 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని భావించి ఆ నిధులను వదులుకొని బోర్లకు మీటర్లు పెట్టబోమని తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ముందుకు రాకపోయినా వడ్లను కేసీఆర్ ప్రభుత్వమే కొంటుందని తెలిపారు.
ఉపాధిహామీ పనులపై లేనిపోని కొర్రీలు పెడుతుందని ధ్వజమెత్తారు. 70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీలు నారాయణఖేడ్ను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎనిమిదేండ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి చేసిందని చెప్పారు. కాళేశ్వరం నీటిని బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి మళ్లించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ద్వారా రెండు పంటలు పండించే అవకాశం లభిస్తుందన్నారు. 57 ఏండ్లు నిండిన వారితోపాటు అర్హులైన వారందరికీ వచ్చే దసరా నాటికి పింఛన్లు ఇచ్చేలా కసరత్తు జరుగుతుందని తెలిపారు.
స్వరాష్ట్రంలో గురుకులాల సంఖ్య రెట్టింపు
సమైక్య రాష్ట్రంలో 91 గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 183కు పెంచిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కంగ్టిలో గిరిజన గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.