హైదరాబాద్, జనవరి 26 : రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు అనుగుణంగా జ్యుడీషియరీ డిస్ట్రిక్స్ను ఏర్పాటుచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రకటించారు. తెలంగాణ హైకోర్టుకు నెల రోజుల్లో మరికొందరు కొత్త న్యాయమూర్తులు వస్తారని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం ఆయన హైకోర్టు భవనంపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ సతీశ్చంద్రశర్మ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా హైకోర్టులో ఆరుగురు మహిళా న్యాయమూర్తులు, జిల్లా కోర్టుల్లో 52 శాతం మంది మహిళా జడ్జీలు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లాల్లో 434 మంది జడ్జీలకుగాను 221 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జీలు 227 మంది ఉన్నారని, నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కరోనా ప్రభావం కేసుల విచారణపై పడకుండా చేపట్టిన చర్యలు ఫలితాలిచ్చాయని, గతేడాది 57 వేల కేసులు దాఖలైతే, 40 వేల కేసులను హైకోర్టు పరిష్కరించిందని వివరించారు. గతేడాది హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించడం శుభపరిణామమని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దివంగత కర్నల్ సంతోష్కుమార్ తల్లిదండ్రులను ప్రధాన న్యాయమూర్తి సతరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున, ఇతర న్యాయాధికారులు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్గౌడ్ పాల్గొన్నారు.