పలుచోట్ల పూర్తయిన స్థలాల కేటాయింపు
మరికొన్నింటిలో త్వరలో కేటాయింపు
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడలు అందుబాటులోకి వచ్చాయి. పలు పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు పూర్తయింది. మరికొన్ని వాడలు మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసుకొని స్థలాల కేటాయింపునకు సిద్ధమయ్యాయి. దేశ విదేశాల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో కొత్త పరిశ్రమల స్థాపన కోసం టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం కింద ఇప్పటివరకు 16,58,460 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు జారీచేసింది. వీటిలో పలు యూనిట్లు సొంత స్థలాల్లో ఏర్పాటవుతుండగా, మరికొన్ని యూనిట్లు టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో ఏర్పాటవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ తెలంగాణ ప్రాంతంలో 109 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయగా.. గత ఏడేండ్లలోనే టీఎస్ఐఐసీ 56 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసింది. వీటిలో 22 హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో, మిగిలిన 34 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన బండ తిమ్మాపూర్ ఫుడ్పార్క్, బండ మైలారం సీడ్పార్క్, కొండాపూర్ జనరల్ పార్క్, తునికి బొల్లారం జనరల్ పార్క్, వరంగల్ జిల్లా కల్లెంలోని టెక్స్టైల్ పార్క్ తదితర చోట్ల స్థలాల కేటాయింపు పూర్తయింది. బెంగళూరు జాతీయ రహదారి వెంబడి నాగిరెడ్డిపల్లి, సిద్ధాపూర్లో అభివృద్ధి చేసిన జనరల్ పార్క్లు, జహీరాబాద్లోని నిమ్జ్ జనరల్ పార్క్ మొదటి దశ, ఖమ్మంలోని బుగ్గపాడు ఫుడ్పార్క్ తదితర చోట్ల మౌలిక సదుపాయాల కల్పన పూర్తికావడంతో స్థలాల కేటాయింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.