ఉచిత విద్యుత్తు ఉచితం కాదంటున్నది కాంగ్రెస్. ఎలాంటి బిల్లు లేకుండా, రైతులకు పైసా కట్టాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పూర్తిస్థాయిలో అమలవుతున్నది. ఇప్పటికి ఇదే బెస్ట్ పవర్ మాడల్. ఎన్నికలకుముందు ఇలాగే చెప్పి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు బిల్లుల మోత మోగిస్తున్నది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అంటూ ఊదరగొట్టిన గృహజ్యోతిస్కీం అంటే ఏమిటో చూద్దామనుకున్న కన్నడ ప్రజలకు ఇప్పుడు గుండె గు‘బిల్లు’మని అంటున్నది. పేరుకే ఫ్రీ కరెంటే కానీ, గతంలో కంటే ఎక్కువ బిల్లు చెల్లించాల్సి రావడం అసలు మాయ. గత ఏడాది వరకు ఇంటికి 200 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా స్కీం వర్తించకపోగా, వాడిన విద్యుత్తుకు మూడు రెట్లు చార్జీ చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు. పోనీ కొత్త కనెక్షన్కైనా ఫ్రీ కరెంటు ఇస్తున్నారా అంటే అదీ లేదు. కేవలం కొత్త వాటికి 59 యూనిట్ల వరకే ఫ్రీ అంటూ కాంగ్రెస్ సర్కారు మెళిక పెట్టింది. ఎన్నికల నాటి ఆకర్షణీయ హామీ.. అధికారంలోకి వచ్చాక జేబులు ఖాళీ! ఇదీ కర్ణాటక గృహజ్యోతి! మరి కాంగ్రెస్ సర్కారా మజాకా!!
– కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్
Karntaka | ఉచిత కరెంటు అంటే ఏమిటి? ఎలాంటి బిల్లు లేకుండా, డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తే ఉచిత కరెంటు.. అంతే కదా? కర్ణాటక ప్రజలు కూడా అలాగే అనుకొన్నారు. కానీ, గతంలోకంటే ఎక్కువ బిల్లులు చెల్లించటమే ఉచిత కరెంటు అని ఇప్పుడు చెప్తున్నారు. బెంగళూర్, నవంబర్ 13: కర్ణాటకలో కాంగ్రెస్ ‘ఐదు గ్యారెంటీ’ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్యారెంటీలతో ప్రభుత్వం ఇస్తున్న షాకులకు అక్కడి ప్రజలకు దిమ్మ తిరిగిపోతున్నది. అరచేతిలో వైకుంఠం చూపించి తమను కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని ప్రజలు లబోదిబోమంటున్నారు. తెలంగాణలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఇలాంటి షాకులేనని, వాటిని నమ్మి ఓటేస్తే జీవితాలు షేక్ అయిపోతాయని హెచ్చరిస్తున్నారు. అన్నీ ఉచితమని ఎన్నికల్లో చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక అడ్డమైన షరతులు పెట్టి నడ్డి విరుస్తున్నారని వాపోతున్నారు. ఐదు గ్యారెంటీలు పచ్చి మోసం, దగా అని మండిపడుతున్నారు. అందుకు గృహజ్యోతి పథకమే తార్కాణం అని విశ్లేషిస్తున్నారు.
పేద, ధనిక తారతమ్యం లేకుండా గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందించే ‘గృహజ్యోతి’ పథకం కర్ణాటకలో ప్రకటించిన ఐదు గ్యారెంటీల్లో ఒకటి. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2.14 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను చూస్తే మతి పోయింది. ఉచిత విద్యుత్తు పథకం అందరికీ వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఊదరగొట్టింది. ఈ పథకం కింద ప్రతి నెలా వినియోగంలో 200 యూనిట్ల వరకు ఉచితమని ప్రజలు అనుకొన్నారు. కానీ, ఇక్కడే ప్రజలను కాంగ్రెస్ బకరాలను చేసింది. 2022 – 2023 ఆర్థిక సంవత్సరం వరకు సగటున 200 యూనిట్లలోపు కరెంటును వినియోగించిన కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. పోనీ 200 యూనిట్ల కంటే తక్కువ వాడిన వారికి ఇబ్బంది ఉండదని అనుకుంటే అందులోనూ మరో మెలిక పెట్టింది. ఒక గృహ వినియోగదారుడు గత సంవత్సరం సగటున 150 యూనిట్ల విద్యుత్తు వినియోగించినట్టయితే, దానికి అదనంగా 10 శాతం కలిపి (15 యూనిట్లు) మొత్తంగా 150+15=165 యూనిట్లుగా లెక్కిస్తారు. దీనినే ప్రామాణికంగా తీసుకొని అంతవరకు మాత్రమే ఉచితంగా పరిగణిస్తారు. 166వ యూనిట్ నుంచి ఎంత వినియోగిస్తే అంత మొత్తానికి బిల్లు చెల్లించాల్సిందే. 200 యూనిట్లు ఉచితం అన్నారు కదా అంటే కుదరదు.. అదంతే.. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క ఇంతే. ఒకవేళ గత ఏడాది విద్యుత్తు కనెక్షన్ లేకుండా ఈ ఏడాది కొత్తగా తీసుకొంటే, వారికి నెలకు సగటున 53 యూనిట్లను పరిగణనలోకి తీసుకొని, దానికి 10 శాతం కలిపి 58-59 యూనిట్లుగా లెక్కిస్తారు. అంటే కొత్తగా కనక్షన్ పొందిన వారికి 59 యూనిట్ల వరకే ఉచితం. 60వ యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్కు రూ.5.60 చొప్పున కట్టాల్సిందే. ఒకవేళ వినియోగం వంద దాటితే మొత్తం ఒకటో యూనిట్ నుంచి యూనిట్కు రూ.7 చొప్పున బాదుతారు.
కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను మూడు శ్లాబుల్లో వసూలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూడు శ్లాబులను రెండుకు కుదించింది. 1- 100 యూనిట్ల వరకు యూనిట్కు రూ.4-75 చొప్పున, 101 యూనిట్ నుంచి యూనిట్కు రూ.7 చొప్పన వసూలు చేస్తున్నది. అయితే, ఇక్కడే చాలామందికి తెలియకుండా ఓ మెలికపెట్టింది. వినియోగం 100 యూనిట్లు దాటితే ఒకటో యూనిట్ నుంచి యూనిట్కు రూ.7 చొప్పున బాదుతున్నది. దీంతో ఉచిత కరెంటు దేవుడెరుగు.. ఇప్పుడు ఇంట్లో కరెంటు బుగ్గ వెయ్యాలంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. గతంలో నెలకు రూ.800 వచ్చే బిల్లు, తాజా నిబంధనలతో మూడింతలు పెరిగి రూ.2,400 వరకు వస్తున్నదని లబోదిబోమంటున్నారు.
ఉచిత విద్యుత్తు పథకంలో మరో మాయాజాలం ఏమిటంటే, ప్రభుత్వం ఉచితంగా ప్రకటించిన 200 యూనిట్లకు ఒక్క యూనిట్ (201) అదనంగా కాల్చినా గృహృజ్యోతి పథకం వర్తించదు. ఇక ఏ వినియోగదారుడైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. గృహజ్యోతి పథకం కోసం వినియోగదారులు విధిగా తమ వివరాలు, డాక్యుమెంట్లతో వెబ్ పోర్టల్ ద్వారా రిజస్టర్ చేసుకోవాలి. ప్రతి రోజు 5 నుంచి 7 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నప్పటికీ ఇప్పటివరకు ఈ పథకానికి ఎంపికచేసిన లబ్ధిదారుల సంఖ్య అక్షరాలా 8 లక్షలే. ప్రభుత్వం మాత్రం ఈ పథకం 2.14 కోట్ల మందికి వర్తిస్తుందని చెప్తున్నది.
అటవీప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాలకు త్రీ-ఫేజ్ కరెంటును పగటిపూట సరఫరా చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండ్రే విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు విద్యుత్తు సరఫరా జరుగుతుండటంతో పొలాలకు వెళ్లే రైతులపై చిరుతలు, పులులు, ఏనుగులు వంటి అడవి జంతువులు దాడులు చేసే ప్రమాదమున్నదన్నారు. ఇదే విషయమై విద్యుత్తు మంత్రి కేజే జార్జ్కి కూడా లేఖ రాశారు.
-సీఎం సిద్ధరామయ్యకు మంత్రి ఖండ్రే విజ్ఞప్తి
విద్యుత్తు చార్జీలు పెంచ డం వల్ల ఉచితానికి అర్థం లేకుండా పోయింది. గతం లో రూ.800 వచ్చే బిల్లు, ప్రస్తుతం రూ. 2,400 వస్తున్నది. ఈ పథకం అందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ అమలులో ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది.
-ఆదిత్య ప్రభాకర్ జోషి, సీనియర్ జర్నలిస్టు, సేడం
ఉచిత కరెంట్ పేరుతో తీవ్రమైన కోతలు పెడుతున్నారు. దీని వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. వేళాపాళా లేకుండా కోతలు విధించడం వల్ల ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియటంలేదు. చలికాలంలోనే ఇలా ఉంటే, ఇక వేసవిలో ఎలా ఉంటుందో.
-పద్మావతి, గృహిణి, బళ్లారి
ఉచిత విద్యుత్తు పథకానికి పెట్టిన నిబంధనల వల్ల అదనపు భారం పెరిగింది. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటినా ఇది ఉచితం వర్తించడం లేదు. మొత్తానికి పెరిగిన చార్జీల మేరకు లెక్కించి బిల్లు విధిస్తున్నారు. ఉచితం ఉచితం అని సంతోషపడుతున్నారు కానీ గతంకంటే విద్యుత్తు భారం పెరిగిందన్న విషయం చాలామంది గ్రహించడం లేదు. ఇప్పడిప్పుడే ఈ విషయం ప్రజలకు అర్థం అవుతున్నది.
– సీ శ్రీనివాస్రావు, బళ్లారి జిల్లా చాంబర్
గతంలో కమర్షియల్ విద్యుత్తుకు యూనిట్కు శ్లాబ్ల పక్రారం రూ.5-6 మధ్యన ఉండేది. ప్రస్తుతం పెంచిన చార్జీల వల్ల ఇది ఏకంగా రూ.7.10 పెరిగింది. దీని వల్ల గతంలో రూ.25 వేలు వచ్చే బిల్లు, ప్రస్తుతం రూ. 40 వేలకు పెరిగింది. ఇది చిన్న పరిశ్రమలకు పెనుభారంగా మారింది. ఉచిత పథకాలకు డబ్బులు లేక ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్తు చార్జీలను పెంచడం వల్ల చిన్న పరిశ్రమలకు తలకుమించిన భారంగా మారుతున్నది.
– మల్లికార్జున్, పోలక్స్ జీన్స్ కంపెనీ యజమాని, బళ్లారి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర విద్యుత్తు సమస్య ఎదుర్కొంటున్నాం. 24X7 కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడేమో 4 X 7 కూడా ఇవ్వడంలేదు. విద్యుత్తు సమస్యను పరిష్కరించలేక గ్రామీణ ప్రాంతాలకు కోతలు విధిస్తున్నారు.
-నాగరాజు, వాటర్ ప్లాంట్ యజమాని, బెట్టిగేరి, కొప్పాల్ తాలుకా