సిద్దిపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మత్స్య శాఖ అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఎళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందన్నారు. కానీ, ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదు.
సీఎం కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారన్నారు. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చు. ఇలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేసేవారు. కానీ, ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చు. సిద్దిపేట జిల్లాలో 281 సోసైటీలు ఉండగా అందులో 20,731 మందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15724 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దాదాపు సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10,434 మంది సభ్యులు ఉన్నారని వివరాలను వెల్లడించారు.
ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మండల వారీగా, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తెల్చాలని ఫిషరీస్ శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
సమాచారం పక్కాగా సేకరించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయి. సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం ఉంటుంది. రుణ సౌకర్యం సుళువుగా జరుగుతుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికి వర్తిస్తాయని మంత్రి తెలిపారు.
సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, పారూఖ్ హుస్సేన్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫిషరీష్ శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.