PM Modi | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ.. కోచ్ ఫ్యాక్టరీ స్థాపన సాధ్యం కాదని చెప్తూ దానిని బీజేపీ పాలిత రాష్ర్టానికి తరలించిన మోదీ సర్కారు.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేసరికి కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నది. కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా కాజీపేటలో వ్యాగన్ల రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని మొన్నటివరకు చెప్పిన కేంద్రం, తాజాగా వ్యాగన్ల తయారీ కేంద్రం నెలకొల్పుతామని కొత్త డ్రామా మొదలుపెట్టింది. కాజీపేటలో వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటున్నారు. ప్రభుత్వ ప్రకటనలపై సామాన్యుల విషయం పక్కనబెడితే రైల్వేశాఖ అధికారులే గందరగోళానికి గురవుతున్నారు. కేంద్ర మంత్రి ప్రచారం చేసుకొంటున్నట్టుగా ప్రధానమంత్రి నుంచి గానీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నుంచి గానీ, ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ నుంచిగానీ, ఇతర రైల్వే అధికారుల నుంచిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవటం గమనార్హం.
రోజుకో మాట.. పూటకో అబద్ధం
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై తొమ్మిదేండ్ల నుంచి కేంద్రప్రభుత్వం రోజుకో మాట..పూటకో అబద్ధం చెప్తున్నది. కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమాయె అని రాష్ట్రప్రభుత్వం వందలసార్లు కేంద్రానికి అడిగింది. ఎంతోకాలం మౌనం పాటించిన మోదీ సర్కారు.. చివరకు దేశంలో కోచ్ ఫ్యాక్టరీలే పెట్టడంలేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. కానీ, కొద్దికాలానికే మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీని కేటాయించి తన కుటిల నీతిని బయటపెట్టుకొన్నది. కేంద్రం దుర్నీతిని రాష్ట్రంలోని అధికార బీజేపీ ప్రజల్లో ఎండగట్టడం మొదలుపెట్టడంతో మోదీ సర్కారు కొత్త నాటకాలు మొదలుపెట్టింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ల రిపేర్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తాజాగా మళ్లీ మాట మార్చింది. కాజీపేటలో వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకొంటున్నది.
బొంకులన్నీ ఎన్నికలకోసమే!
రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ వెంటనే వచ్చే ఏడాది మొదట్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉన్నది. కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలతో స్వీయ నాశనం దిశగా పరుగులు పెడుతున్నది. మరోవైపు విభజన హామీలపై కేంద్రం వివక్షను బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఈ పరిస్థితిలో ఎన్నికల వరకైనా తెలంగాణకు ఏదో చేస్తున్నామని ప్రజలను భ్రమల్లో ముంచాలని బీజేపీ నాయకత్వం ఎత్తులు వేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే కోచ్ ఫ్యాక్టరీపై రోజుకో మాట చెప్తున్నారని పేర్కొంటున్నారు. కొత్తగా వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటుచేయాలంటే మళ్లీ సర్వే చేయాల్సి ఉంటుంది. అందుకు ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు. ఆలోపు ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాత వ్యాగన్ల తయారీ కేంద్రాన్ని కూడా అటకెక్కించొచ్చు అనేదే బీజేపీ వ్యూహమని చెప్తున్నారు.