హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని అభిప్రాయపడ్డారని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఇప్పటికే 105 సార్లు సవరణలు చేసుకొన్నామని, అయినా ప్రజల అవసరాలు, హక్కులను కాపాడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, దీనిపై చర్చ జరగాలని తెలిపారు. ఇక, రాష్ట్రపతి ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతికి దిశానిర్దేశం చేసేలా రాష్ట్రపతి ప్రసంగం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి పాటుపడేలా కేంద్ర విధానం లేదని రాష్ట్రపతి ప్రసంగంలో స్పష్టమైందని చెప్పారు. దేశంలో దాదాపు 14 నెలల పాటు రైతులు పోరాటాలు చేశారని, ఆ పోరాటంలో 750 మంది రైతులు చనిపోతే దానిపై రాష్ట్రపతి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ వ్యక్తం అవుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్రంపై తిరగబడండి.. అని సీఎం కేసీఆర్ రైతులకు పిలుపునివ్వటంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిసినా కేంద్రం తన బలాన్ని అడ్డం పెట్టుకొని రాష్ర్టాలను సంప్రదించకుండా సాగుచట్టాలు తెచ్చిందని, రేపు విద్యుత్తు సవరణ చట్టం తెస్తుందని అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్తు చట్టాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కులాలు, మతాల మధ్య, భాషల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి ఇటీవల కాలంలో ఎక్కువైందని, ఇది జాతిహితానికి మంచిది కాదని హితవు పలికారు. రాష్ర్టాల సమూహమే భారతదేశమని రాజ్యాంగం స్పష్టం చేసినా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటంలో కేంద్రప్రభుత్వం విఫలం అవుతున్నదని ఆరోపించారు. అంబేద్కర్ ఆశించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనకు బీజేపీ తూట్లు పొడుస్తున్నదని, రాష్ర్టాల అధికారాలను కేంద్రం గుంజుకొని అధికారాన్ని చెలాయిస్తున్నదని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని కేకే మండిపడ్డారు. విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయటం లేదని, దేశవ్యాప్తంగా 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 4 ఎన్ఐడీలు , 16 ట్రిపుల్ ఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినా తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కారా? కీలక ప్రజా సంక్షేమ పథకాల్లో కేంద్రం ఎందుకు వివక్ష చూపుతున్నది?’ అని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏడేండ్లుగా తెలంగాణపై కేంద్రం సవతి ప్రేమ చూపుతున్నదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు నెరవేర్చాలని, ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అంబేదర్ అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత, సమైక్యతను కేంద్రం నాశనం చేసిందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని, ఐటీఐఆర్ను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.