హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కయ్యారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి, సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తత్తరబిత్తర అయ్యారు. దీంతో ఈటలను నెటిజన్లు ఓ రేంజ్లో ఆట ఆడుకొంటున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల డమ్మీ అయిపోయాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీజే పీ తెలంగాణ ఏం చేసిందో చెప్పగలరా? అన్న నాగేశ్వర్ ప్రశ్నకు.. ‘నేషనల్ హైవేస్ ఇచ్చింది కదా’ అని ఈటల సమాధానం చెప్పారు. ‘పక్క రాష్ర్టాలకు మంజూరు చేసినా తెలంగాణ నుంచే వెళ్లాలి కదా. రాష్ర్టాన్ని టచ్ కాకుండా హైవేలు వేయగలరా? తెలంగాణకు బీజేపీ ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు’ అని నాగేశ్వర్ విశ్లేషించడంతో ఈటల డంగైపోయారు. కేంద్ర పథకాలపై ఈటల స్పందిస్తూ ‘రాష్ట్రంలో కేంద్ర పథకాలను అమలుచేస్తే మోదీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వాటిని పక్కన బెడుతున్నారని.. ఇందుకు ఆయుష్మాన్ భారతే ఉదాహరణ’ అని ఈటల చెప్పారు. దీనికి నాగేశ్వర్ స్పందిస్తూ ‘మోదీ గుజరాత్ సీఎం ఉండగా అన్నీ నేనే చేశానని చెప్పారా? లేదంటే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లే పథకాలు అమలు చేస్తున్నానని చెప్పుకొన్నారా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఈటలకు నోట మాట రాలేదు.
ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఇంటెలిజెంట్ అని చెప్పుకొనే ఈటల తెలివి బయటపడిందని.. ‘బీజేపీలో చేరి ఆ మందలో కలిసిపోయాడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘కారు’లో కూర్చొని దర్జాగా తిరిగేటోడు.. బీజేపీలో చేరిన తర్వాత తెలివి తక్కువోడు అయిపోయిండు’ అని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వలేదని ఈటల ఇంటర్వ్యూతో బహిర్గతం అయ్యిందని వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్లో ఉన్నప్పుడే సొంతగా పార్టీ పెట్టడంపై ఆలోచించావా? నిన్ను బయటికి పంపడంలో తప్పేలేదు’ అని మరో నెటిజన్ మండిపడ్డారు. ‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నది’ అన్న ఈటల వ్యాఖ్యపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. 8 రాష్ర్టాల్లో ప్రజాప్రభుత్వాలను కూ ల్చిన విధానాన్ని, తెలంగాణలో ప్రభుత్వా న్ని కూల్చేందుకు కుట్ర చేస్తూ దొరకడాన్ని గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నియోజకవర్గాలను శివాలయాలు,వైష్ణవాలయాలతో పో ల్చుతూ, శివాలయాలను తక్కువ చేసి చూపడంపైనా మండిపడ్డారు. ఇన్నాళ్లూ మతాల మ ధ్య గొడవలు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు హిందూమతంలోనే గొడవ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదంటూ ఘాటుగా స్పందించా రు. చివరగా.. కిషన్రెడ్డినీ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.. అని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రం విసిరారు.
సమాధానాలు దాటవేత..
బండి సంజయ్ నియోజకవర్గం కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, ధర్మపురి అర్వింద్ నియోజకవర్గం నిజామాబాద్లో పసుపుబోర్డు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు ఈటల దగ్గర సమాధానం లేకుండా పోయింది.
హైదరాబాద్లో ఐటీఐఆర్ రద్దు చేశారు. హైదరాబాద్కు రావాల్సిన డబ్ల్యూహెచ్వో సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్కు తరలించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. కానీ, గుజరాత్లో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టారు. ఒక్క జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు ఇవ్వలేదు. దీనిని బీజేపీ ఎలా సమర్థించుకుంటుంది? అని ప్రశిస్తే.. ఈటల సమాధానం దాటవేశారు.
తనకు సొంతంగా పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉండేదని ఈటల చెప్పారు. తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరినట్టు పరోక్షంగా ఒప్పుకొన్నారు.