Soyam Bapu Rao | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, కానీ తెలంగాణలో ఈ పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామారాజు జిల్లా కేంద్రం పాడేరులో జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన ర్యాలీలో సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి విలేకరులతో మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. ఇక్కడి రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. పాడేరువాసులు విశాఖ ఎలా వెళ్తున్నారో నాకు అర్థంకావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణం. కొన్ని గిరి గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకోని వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతున్నది.
నేనింకా మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. కానీ.. ఇక్కడ చూస్తే అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సోయం బాపురావుకు డాక్టర్ కాటం శ్రీధర్ అనే నెటిజన్ సోషల్మీడియా వేదికగా చురకలంటించారు. ‘మన తెలంగాణ రహదారులు బాగున్నాయని ఒప్పుకున్నట్టే కదా? పక్క రాష్ర్టానికి పోయి చూసి వస్తే గానీ.. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించలేదా? ఎంపీ గారూ..’ అంటూ ట్వీట్ చేశారు. ఎంపీ బాపురావు వ్యాఖ్యలతో కూడిన పేపర్ క్లిప్పింగ్ను పోస్ట్ చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు వరుస కామెంట్లు పెడుతున్నారు. ‘ఇప్పటికైనా తెలంగాణలో జరిగిన అభివృద్ధి తెలిసొచ్చిందా.. ఎంపీ గారు’ అంటూ సోయం బాపూరావుపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.