హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి ఇంట్లో శుక్రవారం నిర్వహించనున్న ఉపనయనం చర్చనీయాంశమైంది. అది వ్యక్తిగతమైన కార్యక్రమం కాగా, ఈ ఉపనయనానికి తెలంగాణలోని ప్రముఖ అలయాల నుంచి వేదపండితులు వచ్చి ఆశీర్వదించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. బాసర, వేములవాడ, జోగుళాంబ, కాళేశ్వరం, యాదగిరిగుట్ట, స్టేషన్గణేశ్ టెంపుల్, కీసరగుట్ట, చెరువుగట్టు, ఉజ్జయిని మహంకాళి దేవాలయాల ఈవోలకు ఉపనయనానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు, ప్రసాదాలతో సహా వేదపండితులను పంపాలని కమిషనర్ ఆదేశించారంటూ హైదరాబాద్ ఆర్జేసీ రామకృష్ణారావు వాట్సాప్లో ఉత్తర్వులు పంపారు. దేవాదాయ శాఖలో పనిచేసే అర్చక, వేదపండితులు, ఉద్యోగులు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ గత సంవత్సరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ ఆలయానికి సంబంధించి అర్చకులు అదే సంవత్సరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిపై చర్యలు కూడా తీసుకొన్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో ఉద్యోగులు, అర్చకులంతా జోగుళాంబలో జరిగిన గత ఘటనను గుర్తు చేసుకుంటూ గోవిందహరి ఇంటికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటే తప్పులేదా? అని ప్రశ్నిస్తున్నారు.
దేవాలయాల పండితులు కొందరు వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లడానికి కుదరదని చెప్పడం, మరికొందరు అనారోగ్యం కారణంగా రాలేమని చెప్పడంతో ఈవోలు విషయాన్ని ఆర్జేసీ రామకృష్ణారావుకు తెలియజేశారు. ఆయన వెంటనే సదరు ఈవోలకు ఫోన్ చేసి వేదపండితులను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపాలని, ఇది కమిషనర్ ఉత్తర్వు కాబట్టి తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పినట్టు ఒక కార్యనిర్వహణాధికారి తెలిపారు. అంతేకాకుండా, కొందరు వేదపండితులకు ఆర్జేసీ స్వయంగా ఫోన్చేసి గోవిందహరి ఇంటికి వెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. ప్రైవేట్ కార్యక్రమానికి దేవాలయ పండితులను పంపించాలని వాట్సాప్లో ఉత్తర్వులు ఇచ్చారంటూ వైరల్ అవుతున్న పోస్టులపై దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావును ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఫోన్లో అడగగా, అసలు ఈ విషయమే తనకు తెలియదని, తాను ఎవరికీ ఫోన్ చేయలేదని, గోవిందహరి ఇంట్లో కార్యక్రమానికి వేదపండితులను పంపాలంటూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయంపై డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ను వివరణ కోరగా అసలు ఈ విషయమే తన దృష్టిలో లేదని పేర్కొన్నారు.
అసలు దేవాదాయ శాఖలో ఈ గోవిందహరి ప్రాధాన్యతేంది? దేవాదాయ శాఖలో వేరే ప్రాంతాల వారి పెత్తనమేంది? అంటూ సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా బుధవారం పోస్టర్లు వైరల్ అయ్యాయి. ప్రైవేట్ ప్రోగ్రాంకు దేవాదాయ శాఖ పండితులను పంపాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేవుడి సేవలు బంద్ చేసి గోవిందుడి సేవలో తరించాలా? అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గోవిందహరి కార్యక్రమంపై పోస్టులు వైరల్ అవుతుండగానే తెలంగాణ దేవాదాయ శాఖ ఇటీవల నిర్వహించిన వేదపండితులు, అర్చకుల పోస్టుల నియామకాల విషయంలోనూ చాలా అవకతవకలు జరిగాయంటూ మరో పోస్టు వైరల్ అయింది. తెలంగాణ పండితులకు దేవాదాయ శాఖ ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడం లేదని, ఈ ప్రాంత పండితులకు పరీక్షల్లో అన్యాయం చేస్తున్న గోవిందహరి ఇంట్లో ఊడిగం చేయడానికి తెలంగాణ పండితులు కావలసివచ్చిందా? అంటూ ఆ పోస్టర్లలో పలు ప్రశ్నలు సంధించారు.