హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నెల్లూరు జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన మురళీధర్రెడ్డి రైతు కాగా, ఆయన భార్య లక్ష్మీదేవి పొలం పనుల్లో భర్తకు సహాయంగా నిలుస్తున్నది.
ఆ దంపతుల కుమారుడైన వెంకట సాయికృష్ణారెడ్డి ఖరగ్పూర్ ఐఐటీలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల అమెరికాకు చెందిన ఇంటెల్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ ప్యాకేజీతో వెంకట సాయికృష్ణారెడ్డిని ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఈ ఏడాది మే నెలలో కోర్సు పూర్తిచేసి.. ఆగస్టులో ఇంటెల్లో చేరనున్నాడు.