Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. అకాల వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా సర్కారు పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో కాంటా పెట్టేది లేదు… ధాన్యం కొనుగోలు చేసేది లేదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎక్కడికక్కడే ఉండిపోయాయి. తాజాగా అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లన్నీ వర్షార్పణం అయ్యాయి. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు కడగండ్లు మిగిల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రకటనలు గుప్పించారు. కానీ ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇందులో సగానికి పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లనే ప్రారంభించలేదని తెలిసింది. 7200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిన పౌరసరఫరాల సంస్థ ఇందులో ఇప్పటి వరకు 7104 కేంద్రాలను ప్రారంభించింది. వాటిలో 2480 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం గమనార్హం.
అంటే పౌరసరఫరాల సంస్థ ప్రారంభించినట్టుగా చెప్పుకొంటున్న 4624 కేంద్రాల్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అంటే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలిసిపోతున్నది. ఖమ్మం జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఇందులో కేవలం 12 కేంద్రాల్లో మాత్రమే ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 136 కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందులో కేవలం 12 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. మహబూబ్నగర్ జిల్లాలో 195 కేంద్రాలకుగానూ ఇప్పటికీ 34 మాత్రమే ఏర్పాటు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ జిల్లాలో 64 కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేంద్రంలోనూ రైతుల నుంచి ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఈ విధంగా పేపర్లపైనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలును మరిచిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.