హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పనితీరును హైకోర్టు తీవ్రంగా ఎండగట్టింది. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పేర్కొంటూ.. అసమర్థ అధికారులను ఇంటికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీసీబీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తమ ఫిర్యాదును మూసివేయడాన్ని సవాలు చేస్తూ ప్రోస్టర్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఫిర్యాదు మూసివేత ఉత్తర్వులకు కారణమైన జేసీఈఈ కృపానందంపై వేటువేయాలని, ఆయనకు నోటీసులు జారీచేసి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను కొనసాగిస్తే కోర్టు ధికరణగా పరిగణించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది.