హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ‘మేం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాట ఇచ్చాం.. బడులు తెరిచేసరికి కొత్త యూనిఫారాలు ఇస్తామని చెప్పినం. ఇంకా ఇవ్వకపోతే మేం ఏం సమాధానం చెప్పుకోవాలి?’ అంటూ సంక్షేమ శాఖల మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క ప్రశ్నిస్తుండగా.. ‘ప్రభుత్వం గురుకుల విద్యార్థుల యూనిఫారాలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పిందే మే నెలలో. ఆర్డర్ను రెండోవారంలోనే ఇక్కడివారిని కాదని గుజరాత్ కంపెనీకి ఇచ్చాం. వారి దగ్గర నుంచి ఇంకా మెటీరియల్ రాలేదు. అది వచ్చిన తర్వాత వాటిని కుట్టి పిల్లలకు ఇవ్వాలి. ఇందుకు టైం పడుతుంది. మొత్తం ప్రాసెస్ పూర్తికావడానికి కనీసం మూడు నెలలు అవుతుంది. మీరు మాదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు.
మా తప్పేం లేదు’ అని సంక్షేమ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల సమాధానం ఇస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి యూనిఫామ్లు అందజేస్తామని వాగ్దానం చేసిన మంత్రులు అందుకు తగిన ఏర్పాట్లను కనీసం మూడు నెలల ముందు నుంచి మొద లు పెట్టాలని అధికారులు అంటున్నారు. ప్రభు త్వం నిర్ణయం వెలువడిన తరువాత టెండర్ ప్రక్రియ, వస్త్రం ఎంపిక, మహిళా సంఘాలు యూనిఫామ్ కుట్టి తిరిగి అందజేసే వరకు కనీసం నాలుగు నెలలు పడుతుందని వివరిస్తున్నారు. ఇవన్నీ అంచనా వేయకుండా తాము వాగ్దానం చేశాము కాబట్టి నెల రోజుల్లో అంతా జరిగిపోవాలని మంత్రులు భావిస్తే ఎలా సాధ్యమని అధికారులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన సంక్షేమ శాఖల్లో యూనిఫారాల సరఫరా వ్యవహారం దుమారం రేపుతున్నది. ప్రభుత్వం రాష్ట్రంలో బడులు తెరిచేనాటికే విద్యార్థులందరికీ యూనిఫారాలు ఇస్తామని గొప్పలు చెప్పింది. కానీ అమలులో ఆచరణసాధ్యం కావడం లేదు. దీంతో మంత్రులు, అధికారులు ఒకరిపై ఒకరు మీరంటే మీరు కారణం అంటూ నిందలు వేసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క సంబంధిత సంక్షేమ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫారాల సరఫరాపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అధికారుల తీరుపై మంత్రులు భగ్గుమన్నారు. ప్రభుత్వం చెప్తున్నదానికి అనుగుణంగా పనిచేయడంలేదని, ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లుపొడిచేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గురుకుల విద్యార్థులకు యూనిఫారాల కోసం ప్రభుత్వం రూ.675 కోట్లు కేటాయిస్తే వాటిని ఉపయోగించి బట్టలు తెప్పించాల్సిందని, అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెల్సింది.
మంత్రుల వైఖరిపై సంక్షేమ శాఖల బాధ్యత చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి తీవ్రంగా నొ చ్చుకున్నట్టు తెల్సింది. ‘అధికారులను ఎందుకు బ ద్నాం చేస్తున్నారు? నిర్ణయం తీసుకున్నదే మే నెలలో. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఆర్డర్ పెట్టేసరికే ఆలస్యమైంది. దీనికితోడు టెండర్ దక్కించుకున్న కంపెనీకి ఇంకా పూర్తిగా నిధులు వెళ్లలేదు. మొత్తం డబ్బులు ముడితేకానీ తాము వస్ర్తాన్ని పంపిణీ చేయబోమని చెప్తున్నారు. గతంలో కూడా సెప్టెంబర్ వరకు యూనిఫారాలను పంపిణీ చేశాం’ అంటూ ఆ సీనియర్ అధికారి కూడా స్వరం పెంచి చెప్పారు. అయినప్పటికీ వెనుకకు తగ్గని మంత్రులు.. గురుకుల విద్యార్థులకు యూనిఫారాలను సరఫరా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, సీఎం పలుమార్లు ఈ అంశంపై చర్చించారని, అధికారులు సహకరించకపోతే తాము మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయం చెప్పాల్సి ఉంటుందని ఆ సీనియర్ అధికారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
సమావేశానికి హాజరైన సంక్షేమ శాఖ అధికారులు పలువురు మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెల్సింది. దీనిపై స్పందిస్తూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడగా, సీఎంవోకు చెందిన సీనియర్ అధికారి ఒకరు సర్దిచెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తాను ఇలాంటి వాతావరణంలో పనిచేయలేనని, సెలవుపై వెళ్తానని అన్నట్టు తెలిసింది.