కేసముద్రం/మేడిపల్లి/ఆర్మూర్, మే 9: ఇంటర్ పరీక్షలు రాసిన ఆ విద్యార్థి మంచి మార్కులు వస్తయో, రావోనని బెంగపెట్టుకున్నాడు.. ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న కల నెరవేరుతుందో, లేదోనని మధనపడ్డాడు.. సీటు రాకపోతే ఎలా? అన్న అనుమానంతో గత నెల 11న బలవన్మరణానికి పాల్పడ్డాడు.. కానీ, తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి గానూ 892 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు. ఆ మార్కులు చూసిన తల్లిదండ్రులు.. ఎంత పని జేస్తివిరా కొడుకా! అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండా శివారు బోడగుట్టతండాకు చెందిన గుగులోత్ కృష్ణ(19).. ములుగు జిల్లా ఏటూరునాగారం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేశాడు. డాక్టర్ కావడమే లక్ష్యంగా కష్టపడి ఇంటర్ పరీక్షలను విజయవంతంగా రాశాడు. నీట్కు సన్నద్ధమవుతూనే నిరాశకు లోనయ్యాడు. నీట్ మే 6న ఉండగా.. సరిగా చదవలేకపోతున్నానని, ఎంబీబీఎస్ సీటు సాధించలేనేమోనని భావించి ఏప్రిల్ 11న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ సీటు సాధించలేననే మనస్తాపంతోనే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ కూడా రాశాడు. తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తమ కొడుకుకు అత్యధిక మార్కులు రావడం, ఇప్పుడు కృష్ణ తమ కండ్లముందు లేకపోవడంతో తల్లిదండ్రులు లచ్చు, జ్యోతి బోరున విలపిస్తున్నారు.
తాజాగా మరో ఇద్దరు..
జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన బొడ్డుపల్లి అశోక్(18) ఇంటర్లో ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన ఆర్ఎంపీ లక్ష్మణ్ కుమారుడు ప్రజ్వల్(17) ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు వదిలాడు.