వేములవాడ/బోయినపల్లి, నవంబర్ 7: భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. మునుగోడులో పార్టీ విజయం సాధించడంపై సోమవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో గత పార్లమెంటు ఎన్నికల్లో 32 శాతం ఓట్లే సాధించి బీజేపీ తరఫున నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, 68 శాతానికి పైగా ప్రజలు తిరస్కరించినా, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
రాబోయే తరం కోసమైనా ఎన్నికల విధానాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇతర దేశాల్లో లాగా పార్టీకి వచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులను ఎన్నుకునే స్థాయికి భారతదేశం చేరుకోవాలని, దీనిపై చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాలను కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ త్వరలో సమీక్షిస్తారని చెప్పారు.
ప్రతి రైతు ఇంట సిరుల పంట
తెలంగాణ వచ్చాక ప్రతి రైతు ఇంట సిరులు పండుతున్నాయని వినోద్ పేర్కొన్నారు. సోమవారం బోయినపల్లి మండలం కోరెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తున్నట్టు చెప్పారు.