తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ను కోరిన మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిర్చి, ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. తెలంగాణలో ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సహిస్తున్నందున ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో తోమర్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత సంవత్సరమే నల్లతామర తెగులుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రానికి శాస్త్రవేత్తలను పంపారని తెలిపారు. ఈ తెగులు నివారణకు మారెట్లో ఏ మందులూ పని చేయడం లేదని, కేంద్రం వీలైనంత త్వరగా కొత్త మందును అందుబాటులోకి తేవాలని కోరామని పేర్కొన్నారు.
తెగులు నివారణ చర్యలను వేగిరం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రం కోసం ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించామని నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని వెల్లడించారు. ఆయిల్ పామ్ రైతులకు డ్రిప్సిస్టం నిబంధనలు సడలించాలని కోరగా.. త్వరలో ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.