హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఎక్కడో కూర్చొని బ్యాంక్ ఖాతాలు లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు రూపొందించిన సైబర్ క్రైం ఎనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం (సైకాప్స్) సత్ఫలితాలిస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ఆధారంగా తెలంగాణ పోలీసులు రూపొందించిన ఈ టెక్నాలజీని తెలంగాణతోపాటు మరో ఎనిమిది రాష్ర్టాలు వినియోగిస్తున్నాయి. ఇప్పటికే సైకాప్స్లో దేశవ్యాప్తంగా ఉన్న 3,13,006 మంది సైబర్ నేరగాళ్ల ప్రొఫైల్స్ను నిక్షిప్తం చేశారు. వీరిలో 2,952మందిని వివిధ రాష్ర్టాల పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైం టోల్ఫ్రీ నంబర్ 15260, డయల్ 100, డయల్ 112 ద్వారా నమోదవుతున్న సైబర్ నేరాలతో పాటు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) డాటాను సైకాప్స్లో రోజువారీగా అప్డేట్ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏ నంబర్ నుంచి ఫోన్ చేశా రు? కొట్టేసిన డబ్బును ఏ ఖాతాల్లోకి మళ్లించారు? బాధితులను ఎలా మోసం చేశారు? తదితర విషయాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ సైబర్సెల్ ప్రతిరోజూ సేకరిస్తున్నది. దీని ఆధారంగా తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో సైబర్ నేరగాళ్ల డాటాను నిక్షిప్తం చేశారు. ఇందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా పనిచేసేలా తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) వ్యవస్థను రూపొందించారు. దేశవ్యాప్తంగా పట్టుబడ్డ 120 మంది సైబర్ నేరగాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో, అప్పటికే నిక్షిప్తం చేసిన డాటా సహకారంతో దేశవ్యాప్తంగా 28 వేల సైబర్ క్రైం కేసులను ఛేదించడం విశేషం. సైబర్ నేరగాళ్ల అరెస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇతర రాష్ర్టాలతో పంచుకొంటున్నారు. దీంతో మరికొన్ని కేసుల్లో వారిని అరెస్టు చేయడమే కాకుండా నెలల తరబడి జైళ్లల్లో ఉంచగలుగుతున్నారు.
రియల్టైంలో హాట్స్పాట్స్ గుర్తింపు
సైకాప్స్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల డాటాను సేకరించి, క్రోడీకరించి, రియల్ టైమ్లో వారు తిష్ఠవేసిన ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్స్పాట్స్గా మ్యాపింగ్ చేస్తున్నారు. ఇందులో సైబర్ నేరం జరిగిన ప్రదేశానికి నీలం రంగు కోడ్, అరెస్టయిన కేసులకు ఎరుపు రంగు కోడ్ ఇస్తున్నారు. ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం సైక్యాప్స్లో లాగిన్ అయి, హాట్స్పాట్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు ఉంటున్న ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టవచ్చు. హాట్స్పాట్పై క్లిక్ చేయగానే ఏ నేరస్థుడు, ఏ ఫోన్ నంబర్ ద్వారా మోసం చేశాడు? ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో కేసు నమోదైంది? తదితర వివరాలు తెలుస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోని సైబర్ నేరాలు జరుగుతున్న హాట్స్పాట్స్ డాటాను తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే రూపొందించింది. ఇందులో ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం తమకు అంది న సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.
తెలంగాణ రూపొందించినసైకాప్స్ను వాడుతున్న 8 రాష్ర్టాలు
ఉత్తరప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్
దేశవ్యాప్తంగా సైబర్ క్రిమినల్ నెట్వర్క్పై ఫోకస్
సైబర్ నేరగాళ్లు ఏ సుదూర ప్రాంతంలోనో కూర్చొని తెలంగాణలో కూడా మోసాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఏరివేతకు జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్శాఖ ఫోకస్ పెట్టింది. సైక్యాప్స్ టెక్నాలజీతో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల డాటా, వారి నేరాలకు అడ్డాగా ఉన్న హాట్స్పాట్స్ను గుర్తిస్తున్నాం. ఈ టెక్నాలజీని తెలంగాణలో నమోదైన కేసులతో పాటు ఇతర రాష్ర్టాల్లో నమోదైన కేసుల దర్యాప్తులోనూ వినియోగిస్తున్నాం. ఆయా రాష్ర్టాల పోలీస్ సిబ్బందికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు ఇస్తున్నాం. గత ఆరు నెలల్లో 28 వేల కేసుల పరిష్కారానికి తెలంగాణ పోలీసులు సహకరించారు. దీనిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
-రాజేశ్కుమార్,కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీ