Ukraine | రష్యా వైమానిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎంబీబీఎస్ విద్యార్థులు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్లో 18 నుంచి 20 వేల మంది ఇండియన్స్ ఉన్నారు. ఇందులో వెయ్యి మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మెజార్టీ విద్యార్థులు మెడిసిన్ విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఉక్రెయిన్లో ఫీజులు తక్కువ కావడంతో కొన్నేండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెడిసిన్ విద్య కోసం అక్కడికి వెళ్తున్నారు.
ఉక్రెయిన్లో మెడిసిన్, వెటర్నరీ విద్యకు మంచి డిమాండ్ ఉంది. అంతే కాదు.. భారత్తో పోల్చితే అక్కడ ఫీజులు కూడా తక్కువే. ఈ నేపథ్యంలో అక్కడ ఈ కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఒక్క ఏడాదే 5 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంట్లో గుజరాత్కు చెందిన విద్యార్థులు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. వినిచా, డ్నిప్రో, కైవ్, బోగోమోలెట్స్ యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఉక్రెయిన్ – రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన వెంటనే ఆ దేశ బలగాలు ఉక్రెయిన్పై మూకుమ్మడి దాడి చేశాయి. ఉక్రెయిన్ ఎయిర్పోర్టులతో పాటు మిలటరీ శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్లో రష్యా రక్తపాతం సృష్టించింది. వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్నది. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం కూడా ప్రతిఘటిస్తోంది. రష్యాకు చెందిన పలు సైనిక విమానాలను ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. అయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ఖార్కివ్, డొనెట్స్, ఒడెస్సా, జాపోరిజియా సిటీలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈ పట్టణాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ సిటీల్లో ఉండే భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అయితే గత 15 రోజుల నుంచి ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో.. విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలని అక్కడి కళాశాలలు, యూనివర్శిటీలు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు విద్యార్థులు తమ స్వదేశాలకు తిరిగొచ్చారు. నిన్న రాత్రి కూడా పలువురు విద్యార్థులు స్వదేశాలకు బయల్దేరినప్టపికీ.. రష్యా దాడుల నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఉక్రెయిన్ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాట్పాప్ వీడియో కాల్స్ ద్వారా తమ బిడ్డల పరిస్థితిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.