పెద్దపల్లి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యాక్టరీ ప్రారంభించడం మీదున్న శ్రద్ధ.. దాని నుంచి వెలువడే వ్యర్థాల శుద్ధి, విషవాయువుల నియంత్రణ, రక్షణ చర్యలు చేపట్టడంలో కరువైంది. ‘ప్రధాని మోదీ గారు.. మేం ఏం పాపం జేసినం ? మాకెందుకు శిక్ష ? అందరి లెక్క మమ్ముల జూడరా ? ఆర్ఎఫ్సీఎల్ గోడ పక్కనున్నాం.. నానా గోస పడుతున్నాం’ అని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నరకం అనుభవిస్తున్నామని వీర్లపల్లి, శాంతినగర్, ఇందిరానగర్, ఎల్కలపల్లి గేట్, సంజయ్గాంధీనగర్ వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆర్ఎఫ్సీఎల్ వల్ల రామగుండం కార్పొరేషన్ మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది.
రసాయనాలు లీకేజీతో ఉక్కిరిబిక్కిరి
రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ నిర్మాణంలో జరిగిన లోపాలు రామగుండం ప్రజలకు శాపంగా మారింది. కంపెనీ నుంచి తరచూ రసాయనాలు, వ్యర్థాల లీకేజీతో చుట్టుపక్కల వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యర్థాల నిర్వహణకు మురుగు నీటిశుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల మురుగు నీరంతా నేరుగా గోదావరిలో కలిసిపోతున్నది. ఉత్పత్తిపరంగా గణనీయ ప్రగతి సాధించిన ఆర్ఎఫ్సీఎల్ సామాజిక సేవల విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నది.
జల, వాయు, ధ్వని కాలుష్యంతో సతమతం
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వీర్లపల్లి, శాంతినగర్, ఇందిరానగర్, ఎల్కలపల్లి గేట్, సంజయ్గాంధీనగర్లో అన్ని వసతులు కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 20 వేల జనాభా నివసిస్తుండగా విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించటం లేదు. తరచూ అమ్మోనియా, యూరియా తయారీ ట్యాంకుల నుంచి విడుదలవుతున్న దట్టమైన పొగతో స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. ఒక్కోసారి అధిక ఒత్తిడితో వాయువులు లీకవుతుండటంతో ఘాటైన దుర్వాసన వెలువడుతున్నది. మోతాదు మించి శబ్దాలు వస్తుండటంతో ప్రజలు వినికిడి, శ్వాసకోస, గుండెజబ్బులు వంటి సమస్యల బారినపడుతున్నారు.
మా గ్రామాన్ని తరలించండి
ఆర్ఎఫ్సీఎల్ వల్ల ఊరి ప్రజలంతా అనారోగ్యం, ఆవేదనతో బతుకుతున్నరు. కాలుష్యంతో నిత్యం గోస తీస్తున్నం. మంత్రి కొప్పుల ఈశ్వ ర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఢిల్లీకి వెళ్లి గోడు చెప్పుకొన్నం. ఇయ్యాల్టి వర కు ఎవరూ పట్టించుకోలేదు. ఆర్ఎఫ్సీఎల్కు మేం వ్యతిరేకం కాదు. కానీ, మమ్ముల్ని అన్యాయం చేసి రైతులకు ఎరువులు ఇస్తం అంటే ఎలా? ఇక్కడి నుంచి మా గ్రామాన్ని తరలించి పునరావాసం కల్పించండి. దయచేసి ప్రాణాలతో బతికించండి.
– జూపల్లి వేణుగోపాలరావు, వీర్లపల్లి గ్రామ పరిరక్షణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు