హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల అదనపు సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఆదేశించింది. బరాజ్ల సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు ఎన్డీఎస్ఏ నియమించిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. శనివారం హైదరాబాద్ జలసౌధకు చేరుకున్న ఆ బృందం రాష్ట్ర ఇంజినీరింగ్ అధికారులతో నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులు యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్శర్మ, రాహుల్కుమార్ సింగ్, మెంబర్ సెక్రటరీ అమితాబ్ మీనా భేటీ అయ్యారు. తొలుత సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్,ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావుతో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులను ఎవరినీ అనుమతించకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణ ఏజెన్సీలతో వేర్వేరుగా భేటీ అయింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) విభాగం అధికారులతో కొద్దిసేపు చర్చించారు. సాయంత్రం 6:30 గంటల వరకు కమిటీ భేటీ కొనసాగింది. సీడీవో, ఓఅండ్ఎం, బరాజ్ల నిర్మాణంలో పాల్గొన్న అధికారులతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత నివేదికలన్నీ అధ్యయనం చేసిన అనంతరం తదుపరి సమావేశం సమాచారాన్ని అందిస్తామని ఎన్డీఎస్ఏ కమిటీ వెల్లడించిందని తెలిసింది. అనంతరం కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లారు.
మే చివరి నాటికే మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం మొదలవుతుందని,దీంతో బరాజ్ రక్షణకు తక్షణం చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులకు సిఫారసులు చేయాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ విజ్ఞప్తి చేశారు. దీనికి కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సమాచారం. ఇదిలా ఉంటే బరాజ్ రక్షణ చర్యలపై మధ్యంతర నివేదికను వెంటనే ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి తెలంగాణ వికాస సమితి నేతలు విజ్ఞప్తి చేశారు. టీవీఎస్ ప్రధాన కార్యదర్శి అర్రోజు శ్రీనివాస్, నేతలు పులి రాజు, వెంకన్న జలసౌధకు విచ్చేసి కమిటీకి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా వారు నిరాకరించారు. దీంతో వారు మీడియాతో మాట్లాడారు.