హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తిరుమలలో నో ఫ్లైజోన్ ఆంక్షలు ఉన్నప్పటికీ డ్రోన్లతో చేస్తున్న చిత్రీకరణను పూర్తిగా అడ్డుకోవడంపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా చిన్నపాటి మైక్రోడ్రోన్లను సైతం గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నావల్ యాంటీ డ్రోన్ సిస్టం (ఎన్ఏడీఎస్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)తో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తులు డిపాజిట్ చేసిన లగేజీని భద్రపరిచి తిరిగి అప్పగించేందుకు విమానాశ్రయాల తరహాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఆర్ఎఫ్ఐడీ ట్యాగులు వినియోగిస్తామని, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఈ వ్యవస్థ అమల్లోకి రానుందన్నారు.
12 కల్యాణ మండపాలకే అద్దె పెంపు
దేశవ్యాప్తంగా 396 టీటీడీ కల్యాణ మండపాలు ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు వాటిలో12 కల్యాణ మండపాలను రూ.2.8 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించి, వాటికి మాత్రమే అద్దె పెంచామని ఈవో వివరించారు. మిగిలిన 384 కల్యాణ మండపాల అద్దె పెంచలేదని స్పష్టంచేశారు. టాటా సంస్థ అందించిన రూ.150 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ప్రపంచ స్థాయి మ్యూజియం డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రూ.50 కోట్లతో హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామని వెల్లడించారు.