హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): గొర్రె కాపరుల అభ్యున్నతి, మాంసం ఉత్పత్తి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్దన్ రైఖా ప్రశంసించారు. గొర్ల కాపరుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల అధ్యయనం కోసం హైదరాబాద్కు వచ్చిన ఆయన శుక్రవారం మాసబ్ట్యాంక్లోని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం, సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రూ.5 వేల కోట్లు వెచ్చించి 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీపై 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని బాలరాజు యాదవ్ వివరించారు. గొర్రెల యూనిట్లపై సబ్సిడీతోపాటు మందులు, దాణా, బీమా సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. దేశంలోనే మొదటిసారి పశువైద్య సేవల కోసం 1962 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గొర్రెలు-మేకల శిక్షణ సంస్థకు కేంద్రం నిధులు మంజూరు చేయలేదని ఈ సందర్భంగా బాలరాజు గుర్తుచేయగా, నిధుల విడుదలకు ప్రయత్నం చేస్తానని రైఖా హామీ ఇచ్చారు.