కరీంనగర్ : దేశానికి స్వాతంత్య్రం సాధించినప్పటికి సంవత్సరం ఆలస్యంగా రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు సాధించిన సెప్టెంబర్ 17 ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకోవడంతో పాటు భావితరాలకు ఈ రోజు విశిష్టతను తెలియజేయాలన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి నేటికి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించు కుంటున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్,నగర మేయర్ వై. సునీల్ రావు, పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ట్రైనీ కలెక్టర్ లెనిన్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరాపారాణి పాల్గొన్నారు.