Tourism Awards | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని రెండు పర్యాటక గ్రామాలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ర్టానికి చెందిన పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆ అవార్డులను అందుకున్నారు. జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి చెందినది. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం గొల్లభామ చీరల కేంద్రంతోపాటు రంగనాయక కొండలతో ప్రకృతి రమణీయ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్నది.
పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దకడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాలు దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలతో పోటీపడి అవార్డులు దకించుకోవడం, తెలంగాణ ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి చేసిన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ అవార్డులు అందుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్కు, పెంబర్తి సర్పంచ్ అంబాల ఆంజనేయులు, చంద్లాపూర్ సర్పంచ్ సూరగోని చంద్రకళకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను, పర్యాటకశాఖ సంచాలకులు ఇతర ఉన్నతాధికారులను, సిబ్బందిని ప్రశంసించారు. స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ పర్యాటకరంగం సాధించిన పురోగతిగా పేర్కొన్నారు. టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించే దిశగా కార్యాచరణ అమలు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలను పటిష్ఠం చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పెంబర్తి కళాకారులకు శుభాకాంక్షలు: పల్లా
జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రంగా పెంబర్తికి అవార్డు దక్కడం పట్ల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కళలకు అనేక ప్రోత్సాహకాలు లభించాయని, వారి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు.
పర్యాటక స్వర్గధామం : మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్రంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక, పురవస్తు శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ హైటెక్ సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన పర్యాటక దిన వేడుకలు బుధవారం ముగిశాయి. ఈ దిశగా రాష్ట్రంలోని అనేక కొత్త పర్యాటక ప్రాంతాలతోపాటు అన్ని రిజర్వాయర్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలు ఉత్తమ జాతీయ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు అందుకోవడంపై అభినందనలు తెలిపారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, హస్తకళా ప్రదర్శనల కోసం 70 స్టాళ్లను ఏర్పాటుచేశారు. అనంతరం టూరిజం ఎక్స్లెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, బుద్ధవనం ప్రాజక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
‘చంద్లాపూర్ కళ’కు అరుదైన గుర్తింపు
చిన్నకోడూరు, సెప్టెంబర్ 27: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. గొల్లభామ చీరలుసహా ప్రత్యేకమైన చేనేత రకాలను కలిగి ఉన్న ఈ గ్రామం.. పురాతన, సంప్రదాయ నేత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. కేంద్ర పర్యాటకశాఖ ఈ సంవత్సరానికి చంద్లాపూర్ను ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. బుధవారం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్లాపూర్ సర్పంచ్ సురగొని చంద్రకళారవిగౌడ్, సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అజయ్భట్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రంగనాయకసాగర్తో టూరిజం విలేజ్గా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని చెప్పారు. ఇది భూమి త్యాగం చేసిన రైతులందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు.