హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె నిర్వహించనున్నట్టు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లంబ, ఉపాధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు.
ఆ రోజు తెలంగాణసహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులమంతా విధులు బహిష్కరించి, సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ఈ సమ్మె సన్నాహక సమావేశాన్ని బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. డిసెంబర్లో కోల్కతాలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించిన మేరకు ఫిబ్రవరి 16న సమ్మెకు దిగుతున్నట్టు సుభాష్ లంబ, మారం జగదీశ్వర్ తెలిపారు.