హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) / ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ విద్యావిధానంపై (ఎన్ఈపీ) ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. దీనిని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రారంభిస్తారని ఎన్ఈపీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ కిషన్ చెప్పారు. హైదరాబాద్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) కేంద్రంలో సోమవారం సెమినార్ బ్రోచర్ను ఆవిష్కరించారు. సెమినార్కు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రితోపాటు సెంట్రల్, స్టేట్ వర్సిటీల వీసీలు, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చైర్మన్, ఐసీఎస్ఎస్ఆర్ మెంబర్ సెక్రటరీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇతర ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఓయూలోని గణిత విభాగం, లైబ్రరీ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో సెమినార్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. జాతీయ విద్యావిధానం అమలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సదస్సులో సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిపారు. సమావేశంలో సదస్సు కోకన్వీనర్లు డాక్టర్ శంకర్, డాక్టర్ వివేకవర్ధన్, ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, ఏబీఆర్ఎస్ఎం సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి గుంత లక్ష్మణ్, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ శివరాజ్, ప్రొఫెసర్ ఉమేశ్, డాక్టర్ సుజాత, డాక్టర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.