హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధానం, అటవీ పరిరక్షణ చట్టంలో మార్పులు, అగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం పెంపు కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నేతృత్వంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చైర్మన్గా మరో పద్దెనిమిది మందితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో మెజారిటీ సభ్యులు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే అడవులు, పర్యావరణం సంబంధిత శాఖలు, సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు. ఇదే కమిటీలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), అటవీ దళాల అధిపతి ఆర్ఎం డోబ్రియాల్కు స్థానం దక్కింది.
టాస్క్ ఫోర్స్ సూచనలను పరిగణలోని తీసుకుని, అమలు చేసేందుకు మరో వర్కింగ్ గ్రూప్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా తెలంగాణ పీసీసీఎఫ్ కు చోటు కల్పించారు. ఇలా జాతీయ స్థాయిలో అటవీ విధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన రెండు ఉన్నతస్థాయి కమిటీల్లోనూ తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారికి చోటు దక్కటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణకు హరితహారం ద్వారా గత ఏడేండ్లుగా రాష్ట్రం గణనీయమైన పచ్చదనం పెంపుతో పాటు, అనేక వినూత్న పర్యావరణహిత చర్యలను తీసుకుంది. దీనిని అనేక రాష్ట్రాలు మోడల్గా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉన్నతస్థాయి కమిటీలో తెలంగాణకు చోటు దక్కింది.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో బలమైన సంకల్పంతోనే పచ్చదనం పెంపు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, జంగల్ బచావో- జంగల్ బడావో నినాదం, హరితనిధి ఏర్పాటు జాతీయ స్థాయిలో ఆదర్శవంతమైందని అందుకే ఈ గుర్తింపు దక్కిందని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు.
తెలంగాణ మోడల్ను జాతీయ స్థాయిలో వివరించటంతో పాటు, కొత్త అటవీ విధానం, అటవీ చట్టానికి మార్పు చేర్పులు, మరింత పర్యావరణ హితంగా ఉండేలా టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే (మే 5న) ఢిల్లీలో జరిగే టాస్క్ ఫోర్స్ మీటింగ్కు హాజరు కానున్నట్లు తెలిపారు.