అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడు వారి కోవలో నిలుస్తున్నారు సీఎం కేసీఆర్. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన ప్రతీసారి ఎవరో ఒక మహానేత ఉద్భవించి ఉద్యమించడం మనం చూస్తూనే ఉన్నాం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఇవ్వాళ భారత రాజకీయాల్లో స్పష్టమైన వెలితి కనిపిస్తున్నది. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా అంతర్ధానమవుతున్నది. విద్వేషపూరిత విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. కార్పొరేట్ల సేవలో తరిస్తున్నది. ఈ క్రమంలో దేశంలో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. గతంలో కూడా ఇలాంటి దుస్థితి అనేక సార్లు ఏర్పడింది. ఆయా సమయాల్లో కొందరు నేతలు జాతీయ స్థాయిలో మెరిశారు. దేశ రాజకీయ చరిత్రగతిని మార్చేశారు. జేపీ ఉద్యమం, నేషనల్ ఫ్రంట్ సభలు ఇందుకు తార్కాణాలు.
దేశ ‘దశ-దిశ’ను మార్చిన చరిత్రాత్మక సభలు
రామ్లీలాలో పొలికేక: వైద్య చికిత్స కోసం ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళిన సమయంలో తిరుగుబాటు చేసి గవర్నర్ రాంలాల్ సహాయంతో 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. మిత్రపక్షాల మద్దతుతో రామ్లీలా మైదానం లో ఆయన నిర్వహించిన ప్రజాసభ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పర్యవసానం గా 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభ తర్వాతి దశలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎన్టీఆర్కు మార్గాన్ని సుగమం చేసింది.
ఇప్పటి పరిస్థితి వేరు. దేశాన్ని సమూలంగా అభివృద్ధి చేసే శక్తియుక్తులున్న నేత కోసం దేశం యావత్తు ఎదురుచూస్తున్నది. అందరి దృష్టి ఇప్పుడు కేసీఆర్ పై పడింది. భారతదేశానికి ప్రత్యామ్నాయ, సమర్థవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించడంలో కేసీఆరే ధీశాలి అని యావత్తు భారతజాతి ఇప్పుడు విశ్వసిస్తున్నది. దేశంలోని వనరులు, అవసరాలు, ప్రజా సమస్యలపై అవగాహన, సమాఖ్యవాదం పట్ల గౌరవంతోపాటు, లౌకికతత్వానికి నిదర్శనమైన నేత ఆయన ఒక్కడేనని బలంగా నమ్ముతున్నది. కారణం.. ఎనిమిదేండ్ల పసి బిడ్డ తెలంగాణను అభివృద్ధి పథంలో ఆయన నడిపిన తీరును యావత్తు దేశ ప్రజలు గమనించడమే. జాతిజనుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు.. విద్వేష శక్తుల చురకత్తుల చెర నుంచి, కుఠిల, అసమర్థ పాలకుల బారి నుంచి భారత పతాకను విడిపించేందుకు.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమర శంఖం పూరించబోతున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడ్డ ప్రతీ సందర్భంలో ఇలాంటి చారిత్రాత్మక సభలు జరుగుతాయి. అందుకే నేటి ఖమ్మం సభను యావత్తు భారత జాతి ఎంతో తీక్షణంగా గమనిస్తున్నది.
ఎన్టీఆర్కు మద్దతుగా రాష్ట్రపతి భవన్ వద్ద ఏపీ ఎమ్మెల్యేలు (ఫైల్)
రైతుల ఉద్యమ సభలు
భారత ఎన్నికల రాజకీయాలలో రైతుల సమస్యలనే ప్రధాన అజెండాగా జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన మొదటి నేత చరణ్ సింగ్. దేశానికి 5వ ప్రధానిగా ఎన్నికైన చరణ్ సింగ్ అంతకుముందు చేపట్టిన అనేక ఉద్యమాలు, నిర్వహించిన సభల వల్లనే జమీందారీ చట్టం, కౌలు దారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ రుణాలు అందించే విధానమూ ఆరంభమైంది. 1980లో అప్పటి ఉపప్రధాని దేవీలాల్ రూ. 10 వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీని ప్రకటించడం చారిత్రాత్మక ఘట్టం.
నేషనల్ ఫ్రంట్
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ కలిసి 1989లో జనతాదళ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి. అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఈ ఫ్రంట్కు ప్రెసిడెంట్గా వ్యవహరించగా, వీపీ సింగ్ కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని రాజీవ్గాంధీ పాలన, బోఫోర్సు కుంభకోణం ఎండగట్టడంలో ఫ్రంట్ నేతలు సఫలమయ్యారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సభలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతు కూడగట్టుకొని ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. వీపీ సింగ్ ప్రధాని అయ్యారు.
జేపీ సభ
రాయ్బరేలీ నుంచి తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చినందుకు 1975లో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించింది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ. 21 నెలల పాటు దేశంలో అణచివేత రాజ్యమేలింది. ఇందిర నియంతృత్వ పాలనపై లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సమరశంఖం పూరించారు. దేశంలో సంపూర్ణ క్రాంతి రావాలని నినదించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ఇచ్చిన పిలుపునకు యావత్తు దేశం స్పందించింది. ఏకంగా లక్షమంది సభకు హాజరయ్యారు. 1977 ఎన్నికల్లో 271 స్థానాలతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.