హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ కాంక్రీటు ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఈ అవార్డును నిర్వాహకులు ఆర్అండ్బీ శాఖకు ప్రదానం చేశారు. కాగా, ఆర్అండ్బీ ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి కలిసి శనివారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మినిస్టర్ క్వార్టర్స్లోని తన అధికారిక నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన, పూర్తి నాణ్యతతో జరుగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి అవార్డులే వాటికి నిదర్శనమని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన సెక్రటేరియట్, అమరుల స్మారకచిహ్నం, అంబేద్కర్ విగ్రహం, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సమీకృత కలెక్టరేట్లు, కొత్త వంతెనలు లాంటి దీర్ఘకాలిక ప్రయోజనం పొందే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించడం గర్వంగా ఉన్నదని తెలిపారు.
రోడ్లు-భవనాల శాఖ కు వచ్చిన ఈ అవార్డు అధికారులు, ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపుతుందని చెప్పారు. అవార్డు ప్రదానం చేసిన ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడంలో ఆర్అండ్బీ అధికారులు, ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని అభినందించారు. అవార్డు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.