కాచిగూడ, జూన్ 30: దేశంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వేలాది మందితో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలో ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని, ఫలితంగా రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పిళ్లా నివాస్కు ఆయన నియామకపత్రాన్ని అందజేశారు. సమావేశంలో బీసీ నేతలు లాల్ కృష్ణ, నీలా వెంకటేశ్, జీ సత్యం, సీ రాజేందర్, అనంతయ్య, సురేశ్, కిరణ్, సతీశ్, కృష్ణ, కే నర్సింహగౌడ్, శ్రీనివాస్, నాగేశ్వర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.