హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా సమావేశమవుతున్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలతోపాటు మహిళా రిజర్వేషన్, ఉమ్మడి పౌర స్మృతి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో గత తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏనాడూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆలోచించలేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్షకు దిగటంతోనే కేంద్రంలో ఈ కదలిక వచ్చినట్టు జాతీయ మీడియా శుక్రవారం వార్తా కథనాలను వెలువరించింది. బీఆర్ఎస్ పక్షాన కవిత చేపట్టిన దీక్ష కారణంగానే బీజేపీ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తన ఎజెండాలో చేర్చినట్టు ఇండియా టుడే చానెల్ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నాడు కవిత నిలదీశారు.
ఆడపడుచులను తమ తల్లులు, కుమార్తెలు, అక్కాచెల్లెండ్లు అని సంబోధించే బీజేపీ నేతలు వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. లోక్సభతోపాటు రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని నాటి దీక్షలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు అనుగుణంగా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో సమానంగా కొన్నిరాష్ర్టాల్లో అధికంగా కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వారికి రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నదని మరో వార్తా సంస్థ పేర్కొంది. ఇందుకు బీఆర్ఎస్ ఢిల్లీలో దీక్ష రూపంలో చేపట్టిన ఉద్యమమే కారణమని తెలిపింది. దేశంలో మరోమారు మహిళాబిల్లుపై చర్చను లేవనెత్తిన ఘనత ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందని ఉద్ఘాటించింది.
మహిళా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఈ ఏడాది మార్చి 10న జంతర్మంతర్ వద్ద ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు సాధించేవరకు విశ్రమించబోమని నాడు మహిళాలోకం జంగ్ సైరన్ మోగించింది. మూడు దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలు బిల్లు తేకుండా మహిళలను వంచిస్తున్నాయని నారీలోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014, 2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రెండుసార్లు మహిళా బిల్లు తెస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటివరకూ దానిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల పట్ల మోదీకి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే లోక్సభలో బిల్లు పెట్టి ఆమోదించాలని దీక్షలో పాల్గొన్న మహిళలు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు.
ఆ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించగా, ఆప్ ఎంపీ సంజయ్సింగ్, అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ మంత్రి శ్యాం రజాక్, ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి సీమా మాలిక్, సమాజ్వాది పార్టీ ప్రతినిధి పూజా శుక్లా, జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత అంజుమ్ జావేద్ మీర్జా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత షమీ ఫిర్దౌస్, తృణమూల్ నాయకురాలు సుస్మితా దేవ్, ఇంటర్నేషనల్ సిఖ్ కౌన్సిల్ నేత ప్రియా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్కు చెందిన పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ మంత్రులు, పలు కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, వివిధ రాష్ర్టాల నుంచి వందలాదిగా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచి మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియా, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.