హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం తెలంగాణలో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 337 బెంచ్లను ఏర్పాటు చేసి ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 11,55,993 కేసులను పరిష్కరించారు. వీటిలో 5,42,253 ప్రీ-లిటిగేషన్ కేసులు, వివిధ క్యాటగిరీలకు చెందిన 6,13,740 పెండింగ్ కేసులు ఉన్నాయి. వీటి పరిష్కారం ద్వారా కక్షిదారులకు రూ.161.05 కోట్లు పరిహారం లభించనున్నట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి ప్రకటించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్పాల్ పర్యవేక్షించారు.
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్ లో 225 కేసులు (35 ప్రీ-లిటిగేషన్ కేసులు, 190 పెండింగ్ కేసులు) పరిషారమయ్యాయి. తద్వారా 1,100 మంది కక్షిదారులకు రూ.15.93 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ సూరేపల్లి నందా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవి పాల్గొన్నారు.