Singareni CMD | సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరామ్కు జాతీయ స్థాయి ట్రిపుల్ ఐఈ (ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) సంస్థ ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ అవార్డు-2024ని ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో శుక్రవారం రాత్రి జరిగిన 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో ఈ వార్డును ప్రదారం చేశారు. ఈ అవార్డును బలరాం తరఫున ఆపరేషన్, పర్సనల్ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు.
బలరామ్ సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపునకు నిత్యం సమీస్తూ.. గనుల వారీగా లక్ష్యాలను సాధించేలా దిశా నిర్దేశం చేశారు. ఆ చొరవతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బొగ్గు రవాణాను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే రూ.35,700 కోట్ల టర్నోవర్ సాధించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి కన్నా అధికంగా సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించడంతో జాతీయ స్థాయిలో సింగరేణి మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఆయనకు వ్యక్తిగతంగా ‘పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు -2024’ని బహూకరించింది.
అలాగే కంపెనీల విభాగంలో అద్భుతమైన పనితీరును కనపరిచిన కంపెనీగా సింగరేణికి పెర్ఫార్మెన్స్ ఎక్స్లెంట్ అవార్డును నిర్వాహకులు బహూకరించారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుంచి జనరల్ మేనేజర్ (MS) టీ సురేశ్బాబు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర, డీజీఎం (ఐఈ) సీహెచ్ సీతారాంబాబు, ట్రిపుల్ ఐఈ గౌరవ కార్యదర్శి ఏవీవీ ప్రసాద్ రాజు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ లోని ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితోనే లక్ష్యాలు సాధించగలిగామని, సింగరేణికి లభించిన అవార్డులు సింగరేణి సంస్థ ఉద్యోగులకు చెందుతాయని, ఈ స్ఫూర్తితో మరింతగా పనిచేస్తూ ఉన్నత లక్ష్యాలు సాధించాలని సీఎండీ పిలుపునిచ్చారు.