హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సంజీవంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ భవన్లో ప్రారంభమైన రెండురోజుల పాటు నదుల పరిరక్షణపై జాతీయ స్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనగా, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసిందని, ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. నదులను ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదని, వ్యర్థాలతో నిండిపోతున్నాయని, నదుల సంరక్షణ లేక కలుషితం అవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణ, సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేసిందని, ఇందుకు సాక్ష్యం గోదావరి నదేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నదులు కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నదని, గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతోందన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను అందించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనం కోసం స్థానికంగానే నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా గ్రామానికో నర్సరీ లేదని, ట్రాక్టర్, వాటర్ ట్యాంకులూ లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్టు అనీ, దీన్ని కేవలం మూడేళ్లలోనే రికార్డు సమయంలో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వలసలు తగ్గాయని, పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండిస్తున్న పంటలు ఎక్కువ కావడంతో కేంద్రం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసిందన్నారు. నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ఇతర సంస్థలు సైతం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.